కేరళలో కురిసిన భారీ వర్షాలకు ఆ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ వరదలు గత వందేళ్లలో ఎప్పుడూ కేరళలో విలయతాండవం సృష్టించలేదు. చివరిసారిగా 1924లో కేరళ రాష్ట్రం ఈ స్థాయి వరదలతో తల్లడిల్లిపోయింది. ఆగష్టు8,2018 కేరళలో ప్రారంభమైన వర్షాలు కొన్ని వందలమంది ప్రాణాలను బలిగొనగా… చాలామందిని నిరాశ్రయులుగా మిగిల్చింది. మొత్తం 14 జిల్లాలున్న కేరళ రాష్ట్రంలో 13 జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఈ వర్షాకాలంలో కేరళ మాత్రం ఎన్నడూ చూడని భారీ వరదలను చూసింది.అయితే దీని మీద నాసా ఒక రిపోర్ట్ ను విడుదల చేసింది.మరి ఆ రిపోర్ట్ లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయో తెలుసుకుందామా.
కేరళలో కురిసిన భారీ వర్షాలకు వాతవరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది.ఈ విషయం మీద నాసా కొన్ని ఫోటోలను విడుదల చేసింది..కేరళలో వర్షపాతం పై ఉపగ్రహం నుంచి వచ్చిన ఫోటోలను పరిశీలిస్తే జూలై 20న కేరళలో భారీ వర్షాలు కురిశాయి. మళ్లీ ఆతర్వాత ఆగష్టు 8 నుంచి 16 వరకు పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురిశాయి. జూన్ నెలలో అంటే రుతుపవనాలు ప్రవేశించగానే ఆ ప్రాంతం సాధారణ వర్షపాతం కన్నా 42శాతం అధికంగా వర్షపాతం నమోదు అయ్యింది. ఆగష్టు నెలలో మొదటి 20 రోజులు కేరళ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 164శాతం అధికంగా వర్ష పాతం నమోదైంది.ఆగష్టులో కురిసిన భారీ వర్షాలు తద్వారా వచ్చిన వరదలు గత వందేళ్లలో తొలిసారి కావడం విశేషం. భారీ వర్షాలకు రిజర్వాయర్లు నిండిపోవడంతో తప్పని పరిస్థితుల్లో గేట్లు ఎత్తివేసి నీటిని విడదుల చేయాల్సిన అవశ్యకత ఏర్పడింది. దీంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
ఎండాకాలంలో కానీ వాతావరణం పొడిగా ఉన్నసమయంలో కానీ అప్పుడప్పుడు రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసి ఉంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద డ్యామ్ అయిన ఇడుక్కి డ్యామ్ గేట్లు మొత్తం ఎత్తేసి నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇలా 35 డ్యాముల గేట్లు తొలిసారిగా తెరవాల్సి వచ్చింది.డ్యామ్ గేట్లు ఎత్తివేయడంలో ఆలస్యం జరిగింది. గేట్లు ఎత్తివేసే సమయానికి భారీ వర్షాలు కూడా తోడవడంతో భారీ నష్టం చవిచూడాల్సి వచ్చిందని అన్నారు నాసాలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సుజయ్ కుమార్. ఇలాంటి భారీ వర్షాలు ఒక్క కేరళ రాష్ట్రాన్నే కదిలించలేదు.ఆగ్నేయ ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు ప్రతాపాన్ని చూపాయి. తూర్పు మయన్మార్లో జూలై ఆగష్టు నెలల్లో కుండపోత వర్షాలు కురిశాయి.
భారీ వరదల ధాటికి ఒక్క నెలలోనే లక్షా50వేల మంది నిరాశ్రయులయ్యారు. అక్కడ 30 ఏళ్ల తర్వాత ఇలాంటి భారీ వర్షాలు కురిశాయి. బాగో మరియు సిటాంగ్ నదులు గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా పొంగి పొర్లాయి. ఉపగ్రహం నుంచి వచ్చిన చిత్రాలను పరిశీలిస్తే మయన్మార్లో వర్షాలు జూలై 19న ప్రారంభమై ఆగష్టు 18 వరకు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. జూలై 29న మయన్మార్లో అతి భారీ వర్షాలు కురిసినట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి.ఇదేనండి కేరళ గురించి నాసా విడుదల చేసిన విషయాలు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కేరళ వరదల గురించి దాని ద్వారా వాతావరణంలో వచ్చిన మార్పుల గురించి అలాగే పక్క దేశాలలో కూడా తీసుకొచ్చిన వాతావరణ మార్పుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.