కుటుంబకలహాలతో కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం కేశవరంలో జరిగింది. మద్యం మత్తులో గొడవ పడ్డ భర్తను హత్య చేసింది ఈ భార్య. తర్వాత ఈ విషయం బైటకు పొక్కకుండా ఉండేందుకు ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టింది. అయితే గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో శవం కుళ్లిపోయిన వాసన వస్తుండటంతో మళ్లీ ఎక్కడ విషయం బైటపడుతుందోనని భయపడింది. శవాన్ని బైటికి తీసి మరో చోట పడేసింది. ఇలా ఎన్ని విధాలుగా తప్పించుకోవాలని ప్రయత్నించినా చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శామీర్ పేట్ కేశవరం గ్రామానికి చెందిన మల్లేష్ ,జ్యోతి దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. గత కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 3న మద్యం మత్తులో ఉన్న మల్లేష్, భార్యతో గొడవపడ్డాడు. ఈ గొడవలో భర్త నుండి తాను విడిపించుకునే క్రమంలో జ్యోతి అతన్ని నెట్టేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
భర్త చనిపోయినట్లు గుర్తించిన భార్య తీవ్ర ఆందోళనకు గురయ్యింది. ఈ విషయం బయట తెలిసి తనను పోలీసులు పట్టుకెళితే పిల్లలు అనాధలుగా మారతారని బావించి ఓ నిర్ణయం తీసుకుంది. భర్త శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టింది…అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో శవం కుళ్లిపోయి వాసన వస్తుండటంతో మరోసారి శవాన్నిబైటికి తీసి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల గోతిలో పారవేసింది. తర్వాత తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఉండిపోయింది…స్ధానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్య జ్యోతే ఈ హత్య చేసిందని గుర్తించారు.నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మరి చూశారుగా చిన్న తగాది విషయంలో ఆమె ఏకంగా భర్త ప్రాణాలను తీసింది.