జీవనాధారం కోసం కువైట్ కు వెళితే అక్కడ షేక్ ఇంటిలో పది నెలలు బయటి ప్రపంచంతోపాటు కుటుంబ సభ్యులతో సంబంధాల్లేకుండా నరకం అనుభవించామని ఇద్దరు గల్ఫ్ బాధిత మహిళలు వాపోయారు. జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట మాజీ పార్లమెంట్ సభ్యుడు మిథున్రెడ్డి, వైసీపీ నియోజకవర్గ మహిళా నాయకురాలు ఇసుకపాటి నారాయణమ్మల సహకారంతో కువైట్ నుంచి ఇండియన్ ఎంబసీలో అధికారుల ద్వారా ఆదివారం స్వదేశానికి వచ్చిన బాధిత మహిళలు వారి కష్టాలను పోలీసుల ఎదుట వెల్లబోసుకున్నారు.
రైల్వేకోడూరు మండలంలోని వీపీఆర్ కండ్రిక గ్రామపంచాయతీ తాడేవాండ్లపల్లె గ్రామానికి చెందిన వెంబడి రత్నమ్మ), తాడి పార్వతిలు ఈఏడాది మార్చి నెలలో కువైట్ కు జీవనోపాధి నిమిత్తం వెళ్లారు. అదే గ్రామానికి చెందిన చేమూరి బాలాజీ అనే ఏజెంటు మాయ మాటలు విని ఈ ఇద్దరు ఒకే షేకు ఇంటిలోకి పనికి వెళ్లారు. వెళ్లిన నాటినుంచి చిత్రహింసలు ప్రారంభమయ్యాయని, కేవలం మూడు నెలలపాటు మాత్రమే జీతం ఇచ్చారని, ఆతర్వాత ఇంటికి ఫోన్ చేస్తామంటే షేకు ఇంటిలోని అందరూ కొట్టేవారని, అదే కాకుండా తమ పట్ల అసభ్యకరంగా వ్యవహరించే వారని విలపించారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
తమ కష్టాల గురించి వీసా తీసిన ఏజెంటు బాలాజీ, ఆయన తల్లి శంకరమ్మలకు ఫోన్ చేస్తే అక్కడ అంతే అని సమాధానం చెప్పడంతో, తమకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందన్నారు. సుమారు కొన్నినెలలుగా ఫోన్లో కుటుంబ సభ్యులతో మాట్లాడకపోవడం, ఎక్కడ ఉన్నారో తెలియకపోవడంతో రత్నమ్మ భర్త బుజ్జయ్యకు ఆందోళన మొదలై 20 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందన్నారు. కువైత్ షేకుకు ఇద్దరిని అమ్మేశారని చివరిలో తమకు తెలిసిందని కువైట్ నుంచి స్వదేశానికి పంపాలంటే ఒక్కొక్కరు రూ.2లక్షలు చెల్లించాలని సేటు డిమాండు చేయడంతో తాము తీవ్ర ఆందోళనలో పడ్డామన్నారు. వైసీపీ రైల్వే కోడూరు నియోజకవర్గ మహిళా నాయకురాలు ఇసుకపాటి నారాయణమ్మ చొరవతో లక్ష్మయ్య అనే వ్యక్తి కువైత్లో షేక్ ఇంటిలో మాట్లాడి తన దగ్గర ఉన్న డబ్బులతో టిక్కెట్లు తీసి స్వదేశానికి పంపాల్సి వచ్చింది. ఇద్దరికి కలిపి షేక్ కు 1000 దినార్లు చెల్లించారు. (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.2.30లక్షలు)సురక్షితంగా స్వదేశానికి వచ్చిన ఇద్దరు మహిళలు స్థానిక పోలీస్స్టేషన్లో ఏజెంట్ బాలాజీపై ఎస్సై పి.వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు విచారించి నకిలీ ఏజెంట్ల భరతం పడతామని ఎస్ఐ తెలిపారు